నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి - నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జెసికి వినతి మదనపల్లె : మండలం బొమ్మనచెరువు గ్రామానికి సంబంధించిన 10 పోలింగ్ కేంద్రాలను బొమ్మనచెరువులోని ఒకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో జెసిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికల రోజున ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని,సదరు పాఠశాలకు ఒకే చిన్న ప్రవేశ ద్వారం ఉండటం,అది కూడా ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో,10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివస్తే ట్రాఫిక్ సమస్యలు,వాహనాల రాకపోకలకు అంతరాయం,ప్రజల తొక్కిసలాట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని,ముఖ్యంగా వృద్ధులు,మహిళలు,దివ్యాంగులు మరియు ఇతర ఓటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.అదేవిధంగా బొమ్మనచెరువుకు సమీపంలోని పలు గ్రామాల ప్రజలకు మందబండ గ్రామం మరింత అనుకూలమైన ప్రదేశంగా ఉంటుందని వివరించారు.అక్కడ ఇప్పటికే అదనపు పాఠశాల భవనం,స్వర్ణ గ్రామం భవనం (గ్రామ సచివాలయం),రైతు భరోసా కేంద్రం వంటి ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని నిసార్ అహ్మద్ చెప్పారు.అనంతరం మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా మందబండలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినందున,అక్కడ 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని,అందువల్ల బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో 5 పోలింగ్ కేంద్రాలను కొనసాగించి,మిగిలిన 5 పోలింగ్ కేంద్రాలను మందబండ గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆయన జేసిని కోరారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని,ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటామని స్పందించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా,పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ప్రజల సౌకర్యం,భద్రత,రవాణా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు యూనస్,గ్రానైట్ మహేశ్,నవాజ్ అలీ ఖాన్,సాధిక్,షేక్ జబి,యాసిన్,బొమ్మనచెరువు గ్రామస్తులు,ఎంపిటీసి కదిరిపతి,రమణ,ఎల్లుట్ల గణేష్,పి.అమర తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News