నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - ఆగస్ట్ 08 : అన్నమయ్య జిల్లా పీలేరు జగనన్న కాలనీ సమీపంలో నేషనల్ హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ కేసు విచారణలో దిమ్మతిరిగే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో మృతుడి ఆచూకీ లభ్యమైంది. మృతుడిని పీలేరు డిష్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యంగా పోలీసులు అధికారికంగా గుర్తించారు. హిట్ అండ్ రన్ కాదు... మర్డర్ ప్లాన్! తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రహ్మణ్యాన్ని వేరే ప్రాంతంలో హత్య చేసి, ఆపై నేషనల్ హైవేపై పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నేరస్థులు యత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులపైనే అనుమానపు నీడలు! ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల తీరుపైనే పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుబ్రహ్మణ్యం భార్య, పిల్లలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులే హత్య చేసి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యాక్సిడెంట్గా చిత్రీకరించారా? అసలు ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు ఏంటి? కుటుంబంలో ఉన్న వివాదాలేమైనా దీనికి కారణమా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితే కానీ ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి నిజాలు, అసలు సూత్రధారులు ఎవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Reporter
Namitha News