నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యలకు జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా మదనపల్లి రాయచోటి, పీలేరు సబ్ డివిజన్ల పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కాని 22- A సంబంధిత 27మంది రైతులకు సంబంధించిన 27.31ఎకరాలు భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు
సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా డివిజన్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత కీలకమని, పంట రుణాలు, భూమి లావాదేవీలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్ల్యాండ్ రికార్డులు ముఖ్య పాత్ర పోషిస్తాయని జేసి వివరించారు. రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ప్రధాన లక్ష్యమన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జేసి పేర్కొన్నారు.
22-A భూ సమస్యలు పరిష్కరించిన 27మంది రైతులకు, ప్రజలకు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మంజూరు పత్రాలను అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా సర్వే నంబర్ సవరణలు, కొత్త సర్వే నంబర్ల చేర్పులు, అడంగల్ వివరాల సరిదిద్దడం వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ చర్యల ద్వారా ఊరట లభించింది. *వివరాలు:* 1. మదనపల్లి డివిజన్ - 5 మంది - 9.56 ఎకరాలు. 2. పీలేరు డివిజన్ - 18 మంది - 7.61 ఎకరాలు 3. రాయచోటి డివిజన్ - 4 మంది. - 10.14 ఎకరాలు 4. మొత్తం :- 27 మంది - 27.31 ఎకరాలు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు
Reporter
Namitha News