నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. హాజరు వ్యవస్థ కచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను, అలాగే జిల్లా కేంద్రం నుండి పంపబడే వినతులు, వివిధ శాఖల సూచనలను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామస్థుల సమస్యలను ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను కూడా పరిశీలించిన కలెక్టర్, అన్ని రికార్డులను సక్రమంగా నవీకరించి నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయడం ద్వారా భూ వివాదాలు తగ్గి ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు
ఈ కార్యక్రమంలో తాసిల్దారు ధనుంజయులు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News