నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 12: #InvestInAP హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి ఆ కంపెనీ ఏదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఆయన ప్రకటించారు. "2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. 'బిగ్ అన్ వీల్' అంటూ చేసిన ఈ పోస్టుకు #InvestInAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్ట్యాగ్లను జతచేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ హ్యాష్ట్యాగ్లు ప్రతిబింబిస్తున్నాయి. కాగా, 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పలు కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లడం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆగిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, లోకేశ్ ప్రకటించిన ఆ సంస్థ ఏది? ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్కు తెరపడాలంటే రేపు (గురువారం) ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.
Reporter
Namitha News