నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 24 : స్వచ్ఛత యజ్ఞంలో ప్రజలు అందరూ మంచి స్ఫూర్తితో పాల్గొని భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర థీమ్ తో ఇంటి వద్ద కంపోస్టింగ్ (సస్టైనబుల్ సానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్) అనే నినాదంతో మదనపల్లి నియోజకవర్గంలోని తట్టివారి పల్లి వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి కార్యక్రమం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ రోజున నిర్వహించడం జరుగుతున్నదని, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ప్రాంతంలో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాన్ని అధికారికంగా ప్రారంభించారు.
స్వచ్ఛ రథం ద్వారా ప్రతి ఇంటి వద్ద ఉన్న పనికిరాని గృహ వ్యర్థాలు, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, పాత ప్లాస్టిక్ వస్తువులు, పాత నోటుబుక్స్ తదితరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. సేకరించిన వ్యర్థాలను స్క్రాప్ డీలర్లకు అందజేసి, రీసైక్లింగ్కు వినియోగించనున్నట్లు వివరించారు. హౌస్హోల్డ్ల నుండి సేకరించిన వ్యర్థాలకు ముందుగానే నిర్ణయించిన రేటు ప్రకారం సమాన విలువ గల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సబ్బులు తదితర వస్తువులను ప్రజలకు అందించడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తమ వద్ద ఉన్న వ్యర్థాలను ఇచ్చి, దానికి సమాన విలువ గల కూరగాయలు మరియు అవసర సరుకులు పొందారు.ఈ స్వచ్ఛ రథాల కార్యక్రమం విజయవంతమైతే, జిల్లావ్యాప్తంగా మరిన్ని స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టి ప్రతి వీధి నుండి చెత్త సేకరణకు అదనపు మార్గంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైందని, శుభ్రత పట్ల ప్రజల్లో బాధ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత శుభ్రత మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం ఎంతో అవసరమని సూచించారు. ప్రతి పౌరుడు తన ఇంటి ముందు భాగం, వీధి పరిసరాలను శుభ్రంగా ఉంచితే కాలనీ, గ్రామం, పంచాయితీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా స్థానిక మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ...ఒక్క కిలో వ్యర్థాలకు సుమారు రూ.20 విలువ గల వస్తువులు అందించడం ద్వారా చెత్తను భారంగా కాకుండా ఒక వనరుగా ప్రజలు చూడగలుగుతున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా రీసైక్లింగ్కు ప్రోత్సాహం లభించడంతో పాటు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు. శుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన ఇంటి ముందు భాగం, వీధి పరిసరాలను శుభ్రంగా ఉంచినప్పుడే నిజమైన క్లీన్ అండ్ గ్రీన్ సమాజం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సహకారంతో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
Admin
Namitha News