నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చిరునామా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి -- కాంగ్రెస్ పార్టీ సిఎంలలో చరిత్రలో నిలచిన వైయస్సార్ పేరు... కొనియాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్... కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు-- కాంగ్రెస్ పార్టీ పాలనలో అధి నాయకత్వం అందించిన సంపూర్ణ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాల కేరాఫ్ అడ్రస్ గా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) నిలిచారని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. వైఎస్.రాజశేఖరరెడ్డి 77 వ జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులలో చరిత్రలో చిరస్థాయిగా నిలచి, ప్రజా నేతగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలచిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన సంపూర్ణ మద్దతు, నిధుల కేటాయింపు, సంక్షేమ పధకాల అమలుకు ఇచ్చిన ప్రోత్సాహంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన కీలక సంక్షేమ పథకాలు నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమై, నేటికీ వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. ఆరోగ్య సంరక్షణ పథకాలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 108 వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా తీసుకువచ్చారని, మారుమూల గ్రామాలకు వైద్య సేవలను చేరువ చేసిందని వెల్లడించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఫీజు రీ ఎంబస్మెంట్ పథకం ద్వారా పూర్తి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వమే భరించేలా చేసిన చారిత్రక నిర్ణయం అన్నారు. రైతుల వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందించే విధానానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి, బీడు భూములకు నీరందించే హంద్రీనీవా కాలువ నిర్మాణం, రైతు రుణ మాఫీ ఇలా రైతాంగానికి ఎంతో మేలు చేశారని అన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీకే రుణాలు, సొంతిల్లు లేని పేదలందరికీ సబ్సిడీతో కూడిన ఇందిరమ్మ గృహాల మంజూరు, జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల అభివృద్ధి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మీనా కుమారి, శరత్ కుమర్ రెడ్డి, ముబారక్ ఖాన్, అప్సర్ షరీఫ్, ఈశ్వరయ్య, మహమ్మద్ షరీఫ్, మహబూబ్ పీర్, ఖాదర్ బాషా, ఆర్.నాగరాజు, పాలేటి, ఈశ్వరమ్మ, మహమ్మద్ అలీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News