నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 01 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇన్చార్జిగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడిని అధిష్టానం త్వరలో ఎంపిక చేస్తున్నట్లు జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆదివారం మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు జరిగిన మొదటిసారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాకను తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె నియోజకవర్గం నడిపించే నాయకుడు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు అండగా నిలవాలని మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని గత ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడినా ఫలితం లేక పోవడం విచారకరమని భవిష్యత్తులో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలబడి ఆదుకుంటామని ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం తంబళ్లపల్లె నియోజకవర్గానికి దీటైన నాయకుడిని ఎంపిక చేస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం శ్రేణులు నిరుత్సాహపడకుండా ఐకమత్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నుండి భారీగా వాహనాల్లో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించి మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మంత్రి భరోసా ఇవ్వడంతో కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు.
Reporter
Namitha News