నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 11 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా “నెక్స్ట్ జనరేషన్ ఎంబీఏ కెరీర్స్: హెచ్ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్” అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమం ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన ఇన్నోవేటివ్ అకాడమీ ఫర్ ఐటీ సొల్యూషన్స్ ఫౌండర్ & డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ఆధునిక హెచ్ఆర్ ఉద్యోగ అవకాశాలు, ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్, పరిశ్రమలో వస్తున్న మార్పులు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఎంబీఏ విద్యార్థులు పుస్తకాల ద్వారా పొందే పరిజ్ఞానంతో పాటు ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ల ద్వారా సంస్థల్లో ప్రత్యక్షంగా పనిచేసి ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలని అన్నారు. ఇంటర్న్షిప్ల ద్వారా బృందంగా పనిచేయడం, సమయాన్ని సక్రమంగా నిర్వహించడం, పనులను ప్రణాళిక చేసుకోవడం, కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, నాయకత్వ లక్షణాలు మరియు సంస్థల పని విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చని అన్నారు. ప్రస్తుత కాలంలో హెచ్ఆర్ రంగం ఉద్యోగుల నియామకానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతిభ గుర్తింపు, ఉద్యోగుల శిక్షణ, పనితీరు నిర్వహణ, హెచ్ఆర్ డేటా విశ్లేషణ వంటి విభాగాలకు విస్తరిస్తోందని అన్నారు. ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ తయారీ, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రకటనలు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్ ఆటోమేషన్, వినియోగదారుల సమాచార విశ్లేషణ వంటి అంశాలకు ప్రాధాన్యత పెరుగుతోందని తెలిపారు. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు ఏఐ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, డేటా విశ్లేషణ,టీం వర్క్, సమయ నిర్వహణ, సృజనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తరగతి గది నుంచి పరిశ్రమకు విద్యార్థులను సిద్ధం చేయడంలో ఇంటర్న్షిప్లు కీలక పాత్ర పోషిస్తాయని, ఇంటర్న్షిప్ను కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా వాస్తవ ప్రాజెక్టులు, సంస్థాగత అనుభవం మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను పొందేందుకు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, డాక్టర్ గంగిశెట్టి, కోఆర్డినేటర్స్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు, డాక్టర్ కే శిరీష మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News