నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్టు 23 : ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు154 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్యాగధనుడు ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం మని వీరు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో... తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి ధైర్యముంటే కాల్చమని బ్రిటిష్ పోలీసులకు సవాలు చేసిన ధీశాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాసేవలో తన జీవితాన్ని దార పోసిన మహనీయుడని అన్నారు.ఒక మారుమూల గ్రామం నుండి చదువుకొని న్యాయవాది వృత్తి చేపట్టి, అనంతరం స్వరాజ్యం అనే దినపత్రిక తెలుగు తమిళ సంచికలలో ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కృషిచేసి, మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకి గుండుకు తన గుండెను ఎదురొడ్డి స్వేచ్ఛా స్వతంత్రాల కోసం గర్జించి, జగతిని జాగృతం చేసి యువతలో స్వాతంత్ర ఉద్యమకాంక్షను రగిలించిన త్యాగధనులు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఆయన అడుగుజాడలే ఆదర్శంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి, క్రమశిక్షణతో మెలిగి మంచి పౌరులుగా రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు
ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డి.ఆర్.ఓ వెంకటేశు,హౌసింగ్ పిడి రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రావణి,మదనపల్లి ఎం.ఆర్.ఓ మాధవి, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ ల సూపరింటెండెంట్లు, కలెక్టర్ కార్యాలయపు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News