నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బహుజన యువసేన ఫిర్యాదుపై స్పందించిన ఆహార భద్రత శాఖ - మదనపల్లెలో హోటళ్లు,రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు పట్టణంలోని హోటళ్లు,రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు,వంట నూనెను పదేపదే వినియోగించడం,ప్రిజర్వేటివ్లతో కూడిన ఆహార పదార్థాలను ఉపయోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ పది రోజుల క్రితం జిల్లా ఆహార భద్రతాధికారిణి హరితకి ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఆహార భద్రతాధికారి హరిత సోమవారం పునీత్ కుమార్ సమక్షంలో మదనపల్లెలోని పలు హోటళ్లు,రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో అనేక హోటళ్లలో వంట నూనెను పదేపదే వినియోగించడం,ప్రిజర్వేటివ్ల వాడకం,పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం,వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు.సంబంధిత హోటళ్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న జిల్లా ఆహార భద్రతాధికారి హరితకి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఈరోజుతోనే కాకుండా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు తరచూ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు,రెస్టారెంట్లపై ఎలాంటి రాజీలేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News