నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఏప్రిల్ 15 : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో జలధార - జల హారతి కార్యక్రమం కింద చేపట్టిన 100 రోజుల పనుల ప్రగతిపై ఎంపీడీవో, మండల వాటర్ రిసోర్స్ పర్సన్ మరియు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో, వాటిలో ఎన్ని నీటితో నిండివున్నాయో వివరాలు తెలుసుకున్నారు. మేజర్, మైనర్, సబ్, మైక్రో బేసిన్ స్థాయిలో మిగులు (సర్ప్లస్), లోటు (డెఫిసిట్) ప్రాంతాలను గుర్తించి, కాస్కేడ్ వ్యవస్థలో బేసిన్లు, సబ్ బేసిన్లు, చెరువులను పరస్పరం అనుసంధానం చేసే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎంపీడీవో, వాటర్ రిసోర్స్ అధికారులు, నరేగా, గ్రౌండ్ వాటర్ మరియు ఇతర శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు
ఈ సందర్భంగా అక్కడికి విచేసిన మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. జలధార ప్రాజెక్టును శాస్త్రీయ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గతంలో కొన్ని చెరువులకు నీటి సరఫరాలో సమస్యలు ఉన్నాయని, ఫీడర్ చానల్స్, డీసిల్టేషన్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ, రాబోయే మాన్సూన్ నాటికి పనులు పూర్తి చేసి, ప్రతి నీటి చుక్కను పొదుపు చేస్తూ నీటి భద్రత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. మండలంలో ఉన్న 243 ఎంఐ ట్యాంకులను ఒక సమగ్ర జలాశయంగా భావించి, టీఎంసీ స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారంపై తాసిల్దార్ మరియు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కొన్ని సచివాలయాల్లో ప్రగతి సంతృప్తికరంగా లేదని గుర్తించి, ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
చౌడేపల్లి మండలంలోని దిగువుపల్లి పంచాయతీ శెట్టి కుంట చెరువు మరియు కాగతి పంచాయతీ కాగతి చెరువులను కలెక్టర్ పరిశీలించి, వాటి మధ్య ఉన్న కనెక్టివిటీ సప్లై ఛానల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలనే రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలమాధవి, తాసిల్దార్ పార్వతి, సిఐ ప్రసాద్, మండల వాటర్ రిసోర్స్ పర్సన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News