నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 14 : తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, నిరాడంబరతకు మారుపేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుకలు శనివారం రాయచోటిలోని పోలీస్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ గారు సంజీవయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) రామకృష్ణ గారు మాట్లాడుతూ.. సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత సంజీవయ్య గారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. 1938లో ఎస్.ఎస్.ఎల్.సి లో కర్నూలు జిల్లాలోనే ప్రథముడిగా నిలిచిన ఆయన, నేటి విద్యార్థులకు, యువతకు గొప్ప రోల్ మోడల్. సంయుక్త మద్రాసు రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని ఆర్.ఐ. కొనియాడారు. ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐలు ఎ. శ్రీనివాస్, జి. రవి. పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని సంజీవయ్య గారికి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనారు
Admin
Namitha News