నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 06 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన కెరీర్ స్కూల్ & హెచ్.ఆర్ సొల్యూషన్స్ సంస్థ హెచ్.ఆర్ లీడ్ మాస వెంకట సాయి కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ఎక్స్పోలు విద్యార్థులను పరిశోధన, స్టార్టప్లు, పేటెంట్లు మరియు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాల అభివృద్ధి వైపు ప్రోత్సహిస్తాయని అన్నారు. విద్యా సంస్థల్లో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందిస్తూ, విద్యార్థులను భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే సమర్థ ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఎంతో కీలకమని అన్నారు. నేటి సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం చాలా ముఖ్యమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రెండవ, మూడవ మరియు తుది సంవత్సరం విద్యార్థులు మొత్తం 61 బృందాలుగా పాల్గొని, వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు, సమాజంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రతిబింభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్ధి బృందాలకు వరుసగా రూ.2,500, రూ.1,500 మరియు రూ.1,000 నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ సి. చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్. సుధాకర్, డాక్టర్ జి. అరుణ్ కుమార్, డాక్టర్ డి.జె. అష్పిన్ పాబి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News