నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు - ఫిబ్రవరి 07: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం గాలివీడు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పనితీరును, శాంతిభద్రతల పరిస్థితులను ఆయన నిశితంగా పరిశీలించారు. అధికారులకు మరియు సిబ్బందికి విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేస్తూ, పలు రికార్డులు, ప్రాపర్టీ భద్రతపై ఆరా, ముఖ్యంగా కేస్ డైరీ (సీడీ) ఫైళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర విలువైన వస్తువులను స్టేషన్ ఆవరణలో అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని, రికార్డులకు అనుగుణంగా వాటిని పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ల నిఘా మండల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. "సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అక్రమ రవాణా లేదా ఇతర అసాంఘిక పనులకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్ల ఆటకట్టించాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ సందర్బంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత కావాలని, స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామాల్లో చెడు నడత గల వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్) పెద్దయ్య, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News