నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 05 : తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన దీర్ఘకాలిక రైతుల భూuముల సమస్యల పరిష్కారానికి తంబళ్లపల్లి రెవెన్యూ కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, తాహసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అధ్యక్షతన రైతుల సమక్షంలోనే బుధవారం తంబళ్లపల్లె తాహసిల్దార్ కార్యాలయ ఆవరణంలో తాహసిల్దార్ శ్రీనివాసులు రెవిన్యూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొని మండలంలోని రైతులు మండలంలో దీర్ఘకాలికంగా నిలిచిన భూ సమస్యలు, రీ సర్వేలో జరిగిన పొరపాట్లు, ఇంకా పలు రకాల భూ సమస్యలపై గ్రామ సభలోనే రైతులు, అధికారులతో విచారణలు నిర్వహించి అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక కోసం 112 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్ కలెక్టర్ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలపై అధికారి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని నిర్దేశిత కాల పరిమితిలో పనులు జరగాలని సూచించారు. రైతులు సైతం అధికారులకు సహకరించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అనంతరం 107 మంది రైతులకు జాయింట్ ఎల్.పి.ఎం. పొజిషన్ సర్టిఫికెట్లు, ముటేషన్ ట్రాన్సాక్షన్ కరక్షన్స్, లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్.ఓ.ఆర్ అప్పీళ్లు పై విచారణ తో పాటు పరిష్కార మార్గాలకు మార్గం సుగమం చేశారు. తంబళ్లపల్లె మండలంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడంపై సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, తాహసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారుల ను గ్రామసభలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News