నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 21ః రసాయన ఎరువులు, క్రిమిసంహారాలతో పండిన ఫల సాయంతో నేటి సమాజం ఆరోగ్యాలు క్షీణించి నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో ఎడారిలో ఒయాసిస్ లా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ప్రేరణతో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు తంబళ్లపల్లెలో పోర్డు సంస్థ అవగాహనతో పురుడు పోసుకోవడం హర్షనీయం. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె పంచాయతీలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం పై స్థానిక రైతులకు రైతు యాత్రలు,అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం నింపి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడవడానికి పునాదులు వేశారు. ఫోర్డ్ సంస్థ చేసిన ప్రయత్నం ఫలించి నేడు గుండ్లపల్లి పంచాయతీ లో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పంటల ఫలాలతో సత్ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ప్రకృతి వ్యవసాయం లో భాగంగా సేంద్రియ ఎరువులు, పేడ ఎరువు, కషాయాలతో వేరుశనగ, మామిడి, మొక్కజొన్న, సుమారు 30 రకాల చిరుధాన్య పంటలు, ఆకుకూరలు, కూరగాయల పంటలు పండించడంతోపాటు అధిక దిగుబడి సాధించారు. ఇందులో భాగంగా శనివారం ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ, రమణ, సంపూర్ణ, హేమంత్, ఏ పి సి ఎన్ ఎఫ్ ప్రతినిధి రాజు గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అభినందించారు. రైతు నరసింహులు వేసిన మామిడి, అంతర్ పంట వేరుశనగ ఎకరాకు 15 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పడం తో ప్రకృతి వ్యవసాయం లో నైతిక విజయం సాధించి గుండ్లపల్లి రైతులు ఆదర్శంగా నిలిచినట్లు లలితమ్మ కొనియాడారు. అదేవిధంగా మరో రైతు మనోహర్ తనకున్న కొద్దిపాటి పొలంలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండించి లబ్ధి పొందడం విశేషం. ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుల పొలాలు భూసారం పెరిగి పండిన ఫల సాయం మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ కలుగుతుందని వారికి హితబోధ చేశారు. ఆమె వెంట ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News