నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 05 : పరిశ్రమల పేరుతో దళితుల భూమి దోచేస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లి మండలం పరిధిలోని రెడ్డికోట వద్ద బలవంతపు సేకరణకు వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మా భూములు లక్కోవద్దు, మా పొట్ట కొట్టద్దు అంటూ నినదించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల భూములు జోలికి వస్తే ఖబడ్దార్, ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పాలకులు ఎవరైనా బడుగు బలహీన రైతులే సమిధలవుతున్నారని అన్నారు. ఎలాంటి పరిశ్రమలు పెడుతున్నారో వివరించకుండా, వాటి ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయో తెలపకుండా, ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందో వివరించకుండా, కేవలం పరిశ్రమలు వస్తాయని పేరుతో ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా భూములు సేకరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గం అన్నారు. వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూ సేకరణ చట్ట తెచ్చిందని, గ్రామ తీర్మానం, రైతుల అనుమతి లేకుండా భూములకు 11(1) నోటీసులు ఇవ్వడం ద్వారా అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభ తీర్మానం చేయకుండానే ప్రాథమిక ప్రకటన చేయడం అభ్యంతరకరమన్నారు 46 ఎకరాల భూమిలో 84 మంది రైతులు ఉన్నారంటేనే అందరూ పేదలనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. తంబళ్లపల్లె మండలంలోని ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిని పరిశీలించకుండా కేవలం దళితులు, బీసీలు ఎన్నో ఏళ్లుగా అనుభవించుకుంటున్న భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ కు కట్టబెట్టాలనుకోవడం కూటమి ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం అన్నారు. అధికారులు పునరాలోచించుకుని భూములు తీసుకోవడం నుంచి వెనక్కి తగ్గాలని, ప్రత్యామ్నాయ భూములు గురించి ఆలోచించాలని లేనిపక్షంలో పేద రైతులు కూడగట్టి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుధీర్ కుమార్ నిర్వాసిత రైతులు భాస్కర, శ్రీనివాసులు, వెంకటరమణ, శ్రీరాములు, నాగమల్లు, హరి, రమణమ్మ, రెడ్డెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News