నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక అసమానతలును రూపుమాపేందుకు జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనిద్దామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్, మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ భాష, డిఆర్ఓ, అధికారులు, వివిధ బిసి సంఘ నాయకులు, ప్రతినిధులు పూలమాలు పుష్పాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలన.. స్త్రీ విద్యకు పాటుపడిన మహనీయుడన్నారు. విద్య సమాజ అభివృద్ధికి ప్రధాన ఆయుధమని పూలే విశ్వసించారని, ప్రతి ఒక్కరు విద్యను పొందేలా చేయడం ద్వారా సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. అప్పటి ప్రతికూల పరిస్థితుల్లో విద్య కోసం పోరాడటం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి విలువలను సమాజంలో మరింతగా వ్యాప్తి చేయాలని కోరారు. వారి ఆశయాలు ప్రతి తరానికి మార్గదర్శకమని, వాటిని కొనసాగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక సంస్కర్త, విద్యా సంచాలకుడు మరియు సమానత్వ పోరాట యోధుడన్నారు. ఆయన జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితమైందని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అలాగే 1848లో భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు నూతన దిశను చూపారని చెప్పారు. ఆ కాలంలో మహిళా విద్యపై ఉన్న అపోహలు, భయాలను తట్టుకుని ముందుకు సాగడం ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారు. వితంతువుల పునర్వివాహం, వితంతువుల విద్య, వారి గౌరవప్రదమైన జీవనం కోసం తీసుకున్న చర్యలు ఆ కాలంలో విప్లవాత్మక సంస్కరణలుగా నిలిచాయని పేర్కొన్నారు. భర్త మరణించిన మహిళలు జీవితాంతం బాధల్లోనే ఉండాలని భావించిన సమాజంలో, వారికి కొత్త జీవితం ఇవ్వాలని పూలే చేసిన ప్రయత్నాలు ఎంతో గొప్పవని వివరించారు. అలాగే అంటరానితనం అనే సామాజిక రుగ్మత నిర్మూలించేందుకు మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన కృషి అపూర్వమని చెప్పారు. కులవివక్ష వంటి సమస్యలు సమాజాన్ని విభజించే ప్రమాదకర అంశాలని గుర్తించి, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన పునాది వేశారని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం సమానంగా జీవించే హక్కు కలిగి ఉందనే సందేశాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. చంద్రశేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.ఎం.ప్రవీణ్ తాజ్, జంగం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, పాలయకరి చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు బోడెం రాజశేఖర్, గంగులప్ప, సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News