నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 05 : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ద్వారా భవిష్యత్తులో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తామని వాటర్ గ్రిడ్ డి.ఈ డి. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జి. వినోద్ కుమార్ తో కలిసి వాటర్ గ్రిడ్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2370 కోట్లతో తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో 18 మండలాలకు ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గండికోట జలాశయం ద్వారా తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని 12 మండలాలు,రాయచోటి నగరానికి చెందిన ఆరు మండలాలకు వెలిగల్లు జలాశయం ద్వారా తాగునీరు పంపిణీ జరుగుతుందన్నారు. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ లో నీటి శుద్ధి ప్లాంటేషన్లు నిర్మించి అక్కడి నుండి స్వచ్ఛమైన తాగునీరు ప్రతి గ్రామం తద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామన్నారు. ఈ వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం, పైపు లైన్లు పనులు మరో 20 రోజుల్లో ప్రారంభించి వేగవంతం చేస్తామన్నారు. భవిష్యత్తులోఈ మూడు నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. ఆయన వెంట బోర్ మెకానిక్ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News