నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండెం - జూన్ 30 : రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టరు పరిశీలించారు. ముందుగా రైతు ఖదర్ నిషా అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్.. పంటల పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, నీటి వినియోగం, ఖర్చులు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్కువ నీటితోనూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు. అనంతరం విత్తన పెల్లెటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. విత్తనాలకు సహజ పదార్థాలతో పూత పూయడం వల్ల మొలక శాతం పెరగడం, ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల మెరుగుపడడం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడం, వేర్ల అభివృద్ధికి దోహదపడడం వంటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా అక్కడి రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ..., ఎల్నినో ప్రభావంతో వాతావరణ మార్పులను, వర్షపాతం తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న పంటలపై పూర్తిగా ఆధారపడకుండా, స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును, నీటి సంరక్షణ పద్ధతులను గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు అధికారులు–రైతులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎల్నినో దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయం, ఆరుతడి పంటల సాగు, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. నీటి సంరక్షణతో పాటు రైతుల ఆదాయం స్థిరంగా ఉండేలా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారం పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకట మోహన్, ఎఫ్ఎంటి సిద్ధయ్య, పద్మావతి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలు, రైతులకు అందిస్తున్న సాంకేతిక సేవలపై అధికారులు కలెక్టర్కు వివరించారు
Reporter
Namitha News