నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హంద్రీ-నీవా జలాలతో తాగునీటి ట్యాంకులను నింపుతాం - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి - చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలన మదనపల్లె : మదనపల్లె పరిధిలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం పరిశీలించారు.ట్యాంక్లో చేపడుతున్న పనుల పురోగతిని,పెండింగ్లో ఉన్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ,హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువల సంబంధిత అధికారులను ఆదేశించారు.ట్యాంక్లో పేరుకుపోయిన వ్యర్థ మొక్కలు,పిచ్చి మొక్కలు తదితరాలను పూర్తిగా తొలగించి ట్యాంక్ను పరిశుభ్రంగా,నీటి నిలువకు అనుకూలంగా సిద్ధం చేయాలని సూచించారు.చిప్పిలి ట్యాంకులో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచేందుకు తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి,గత ఏడాదితో పోలిస్తే అధికంగా నీటిని నిలువ చేయాలని సూచించారు.నీరు వృథా కాకుండా షెడ్యూల్ ప్రకారం,క్రమబద్ధంగా ట్యాంకులను నింపుతూ ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోకి చేరే హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాల కోసం వినియోగించడమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.పట్టణ ప్రజలకు సురక్షితమైన,నిరంతర తాగునీటి సరఫరా అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ట్యాంక్కు చేరే సమయానికి ఎటువంటి సాంకేతిక,నిర్వహణ పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,నీటి నిల్వ,శుద్ధి మరియు మదనపల్లె పట్టణానికి తాగునీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ.వెంకట్రామయ్య,హంద్రీ- నీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైరల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News