నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైద్య విద్య, ప్రభుత్వ వైద్యశాలల ప్రయివేటీకరణతో పేద పట్ల సిఎం చంద్రబాబునాయుడు తన వ్యతిరేక వైఖరి కొనసాగుతోందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు. మదనపల్లె మండలం కొండమర్రిపల్లి, తట్టివారిపల్లిలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వర్షం పడుతున్నా కార్యకర్తలు, నాయకులు కోటి సంతకాల సేకరణలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో పరికరాలు గుంటూరు GGH కు తరలించడాన్ని ఖండించారు. వైద్య కళాశాలలు PPP విధానానికి వ్యతిరేకంగా వైసిపి పోరాటం చేస్తున్న తరుణంలోనే మదనపల్లె జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలోని అధునాతన పరికరాలు గుంటూరు GGH కు తరలింపు చోటుచేసుకున్నాయని, ఇది ఖచ్చితంగా ప్రయివేటీకరణకు బలం చేకురుస్తోందని అన్నారు. 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే సిఎం చంద్రబాబునాయుడు ప్రయివేటు రంగానికి ఇచ్చే ప్రధాన్యత ఏమిటో ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు మదనపల్లె నియోజకవర్గంలో రోడ్లు మొత్తం గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా మదనపల్లె బెంగుళూరు రోడ్డు, రామసముద్రం, నిమ్మనపల్లె రహదారులు మరింత దారుణంగా వున్నాయని ఆరోపించారు. మెడికల్ కళాశాలు ప్రయివేటీకరణ తోపాటు మదనపల్లె జిల్లా ప్రభుత్వం హాస్పిటల్ కూడా ప్రయివేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దీనిని ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరో వైపు రాష్ట్రంలోని నూతన మెడికల్ కాలేజీల PPP విధానంలో చేపడితే పేదలకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ PPP విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి తేవడమన్నది ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డి సృష్ఠించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కి పేరుప్రతిష్ఠలు వస్తాయో అన్న కుతంత్రంతోనే మెడికల్ కళాశాలలను పీపీపీ అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నారన్నారు. సంపద సృష్ఠి అంటే వేలల్లో ఖర్చుపెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో ఖర్చుపెట్టి చదివేలా చెయ్యడమేనా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డి, కరుణాకర్ రెడ్డి, తట్టి శ్రీనివాసులు రెడ్డి, వెలుగు చంద్ర, దీపా వేమారెడ్డి, ఇస్మాయిల్, మహేష్, చిప్పిలి మల్లికార్జున, మేరీ, శ్యామల, నాగమణి, హబీబ్, నాగార్జున, చెన్నా, జబీవుల్లా, ఖిజార్ ఖాన్ పాల్గొన్నారు.
Reporter
Namitha News