నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -సెప్టెంబర్ 13 : మదనపల్లె సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ‘ఎకో బప్పా మోరియా 3.0’ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 74 బృందాలు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆకృతుల్లో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను రూపొందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, వినాయక చవితి హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని, అయితే రసాయనాలు, హానికర పదార్థాలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు, పర్యావరణం కలుషితమవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని, మట్టి మన జీవనానికి ఆధారమైన సహజ వనరు కాబట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలించిన అనంతరం మొదటి బహుమతిని ఆర్.అనూష & టీం, రెండవ బహుమతి ఎస్ లహరి & టీం మరియు మూడవ బహుమతి అభిషేక్ & టీం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ & అసిస్టెంట్ డీన్- అక్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్, సి.ఎస్.టి విభాగాధిపతి డాక్టర్ దినేష్, ఎంఎస్ ఆర్ క్లబ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి. రెడ్డి హేమంత, శాయీజ్ అహమ్మద్, డాక్టర్ నవీన్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News