నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 13 : అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగ్వేజస్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం “టోస్ట్మాస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి” అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టోస్ట్మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ, ఆంధ్ర మరియు తెలంగాణ డివిజన్ డైరెక్టర్ విక్రమ్ చంద్ర పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణంలో వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, టోస్ట్మాస్టర్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజల ముందుకు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్లబ్ సమావేశాలు విద్యార్థులకు సురక్షితమైన మరియు ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పిస్తూ వారి ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయని అన్నారు. టోస్ట్మాస్టర్స్ విద్యా కార్యక్రమం సంభాషణ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించబడిన అభ్యాస ప్రయాణమని, వివిధ పాత్వేస్ ద్వారా విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. అలాగే స్పీచ్క్రాఫ్ట్ వంటి ప్రసంగ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు మాట్లాడే భయం తొలగి, ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలు మరియు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, టీమ్వర్క్, లీడర్షిప్ మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, టోస్ట్మాస్టర్స్ శిక్షణ ద్వారా విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్లు మరియు కార్పొరేట్ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనే సామర్థ్యం పెరిగి, విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ సుధాకర్ బీదం, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్. బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీగణేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News