నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 16 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో “అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరియు డాకర్ టెక్నాలజీలను ఉపయోగించి పరిశ్రమల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగం” అనే అంశంపై హాండ్స్ ఆన్ వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని అమృత విశ్వ విద్యాపీఠం స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ టెక్నాలజీలను అర్థం చేసుకొని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించే క్లౌడ్ సేవలు, డేటా సెక్యూరిటీ, బ్యాకప్ సదుపాయాలు మరియు ఆధునిక ఐటీ రంగంలో అప్లికేషన్ల అభివృద్ధికి క్లౌడ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ వర్క్షాప్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ సేవలు, డాకర్ టెక్నాలజీ, ఆటోమేషన్ విధానాలు, అప్లికేషన్లను క్లౌడ్లో ఎలా అమలు చేయాలి మరియు వాటిని ఎలా కలపాలి (ఇంటిగ్రేషన్) వంటి విషయాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. క్లౌడ్ ఆధారంగా అప్లికేషన్లు ఎలా తయారు చేయాలి, ఎలా నిర్వహించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆధునిక ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేవ్ఓప్స్ మరియు కంటైనర్ టెక్నాలజీలపై నైపుణ్యాలు పెంపొందించుకుంటే భవిష్యత్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పన, కోఆర్డినేటర్లు ఎ. నాగ లక్ష్మి, ధనలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News