నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 10 : సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ ఇంటి భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్య పరచడానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పండుగ సెలవుల్లో ఇళ్లను వదిలి వెళ్ళే వారు పాటించవలసిన కీలక భద్రతా సూచనలను ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసారు. ప్రజల కోసం ఎస్పీ గారి కీలక సూచనలు ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడండి. గేట్లకు బయట నుంచి కాకుండా, లోపలి వైపు తాళం వేయడం వల్ల మీరు ఇంట్లో లేరనే విషయం బయటి వారికి తెలియకుండా ఉంటుంది. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దు. వాటిని బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకస్థులైన బంధువుల వద్ద ఉంచడం క్షేమకరం. ఇంటి పరిసరాల్లో హై-రిజల్యూషన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. వీటిని మీ మొబైల్ ఫోన్కు అనుసంధానించడం ద్వారా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. ఊరెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా బీట్ కానిస్టేబుల్కు సమాచారం ఇవ్వాలి. దీనివల్ల గస్తీని ముమ్మరం చేసే వీలుంటుంది. మీరు లేని సమయంలో మీ ఇంటి పరిసరాలపై కన్నేసి ఉంచమని నమ్మకమైన పొరుగువారికి చెప్పండి. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోమని కోరండి. ప్రయాణ వివరాలు, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలకు సులభంగా సమాచారం అందుతుంది. పండుగ ముగిసి ఇంటికి చేరిన తర్వాతే ఫోటోలను షేర్ చేయండి. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ ప్రాంతాలు వెలుగుతో ఉండేలా చూడండి. చీకటి దొంగలకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు మరియు కాలనీల్లో పోలీస్ వాహనాల ద్వారా మైకుల ద్వారా విశృతంగా ప్రజలకు అవగాహనా కల్పిస్తూ రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరియు బీట్ కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్తానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలి. "మీ భద్రత మా బాధ్యత, కానీ మీ జాగ్రత్త మాకు అదనపు బలం. పోలీసుల సూచనలు పాటించి, నేరరహిత సమాజానికి సహకరిస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి" అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకాంక్షించారు
Admin
Namitha News