నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 8: అభివృద్ధి సంక్షేమానికి టిడిపి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కోళ్లబైలు పంచాయతీలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోళ్లబైలు టిడిపి ఇన్ ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీలో 14 వేలకు పైగా జనాభా ఉన్నారని, 5 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని, అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. ఒక్క రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు. టిడిపి కూటమి సర్కార్ అధికారం చేపట్టిన 16 నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష కోళ్లబైలు పంచాయతీ పై ప్రత్యేక దృష్టి సారించి రూ. 4.5 కోట్ల నిధులతో 39 రోడ్లను వేయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోళ్లబైలులో 12 వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా తమ ప్రభుత్వం లో నిధులు కేటాయించామని వైసీపి నేత నిస్సార్ అహ్మద్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ ను తామే తెచ్చామని వైసీపి అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిస్సార్ అహ్మద్ మతిభ్రమించి తామే నిధులు కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు. వైసిపీ హయాంలో నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం వంద ఇళ్లు మంజూరు చేస్తే 200 ఇంటి స్థలాలు ఆక్రమించుకున్నారన్నారు. నిసార్ అహ్మద్ కు చిత్తశుద్ది ఉంటే వైసీపి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిమాలి శేఖర్ రాయల్, రెడ్డిశేఖర్, జివి నాయుడు, శ్రీనాథ్, రామచంద్ర, స్నేహ మెడికల్స్ రమేష్, మోహన్ రెడ్డి, అంజి,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News