నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 17: మదనపల్లి రూరల్ మండలం, పోతబోలు గ్రామపంచాయతీ, సర్వే నెంబర్ 153లో జరిగిన రూ 100 కోట్ల భూ దోపిడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలికు విన్నవించారు. సోమవారం రాయచోటి లోని జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు భూ బాధితులు నారాయణస్వామి, వరప్రసాద్, లత, మల్లికార్జున శెట్టి, ఇషాక్, మహల్ బాప్ జాన్, త్యాగరాజు, రెడ్డప్ప, వెంకటరమణ, పలువురు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యనగర్ రియల్ ఎస్టేట్ పేరుతో గత 15 ఏళ్ల కిందట పోతబోలు గ్రామపంచాయతీలో సర్వే నెంబర్ 153లో 3.54 ఎకరాల స్థలంలో కొందరు వెంచర్ వేసినట్లు తెలిపారు. ఈ వెంచర్ లో మొత్తం 192మంది కంతుల ప్రకారం ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు ఎవరికి కావాల్సిన ఇళ్ల స్థలాలను భాగ్యనగర్ వెంచర్లో కేటాయించినట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో బాబ్ జాన్, నిజాముద్దీన్, కృష్ణప్ప, నాగరాజు అనే వ్యక్తులు వెంచర్ లో వేసిన రాళ్లను తొలగించి, మొత్తం స్థలాన్ని చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఫెన్సింగ్ వేశారని తెలిపారు. వీరే ఆ భూమి తమదే అని వారి ఆధీనంలో ఉంచుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 192 మంది కొనుగోలుధారులు ఈ స్థలాలపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, అక్కడికి వెళ్లిన భూ బాధితులను బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఇప్పుడు ఇదే స్థలాల పక్కనే నేషనల్ హైవే రోడ్డు వెళ్ళిందని, అక్కడ కుంట స్థలం రూ. 30 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాట్లు కొన్నవారికి స్థలాలు చూపకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం చెందారు. అక్కడికి వెళ్లిన వారిని బెదిరించి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే స్థలాలు కొన్న భూ యజమానులు, వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోతున్నట్లు తెలిపారు. ఇందులోని 1.25 ఎకరాల భూమిని చదరపు గజములతో విక్రయం చేసి, వారి అనుభవంలో ఉంచుకున్నట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని మదనపల్లి తహసీల్దార్ కు విన్నవించడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను, ప్లాట్ల నెంబర్లను కూడా జత చేసి రెవిన్యూ అధికారులకు అందించినట్లు తెలియజేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆగస్టు 30న ఆ స్థలంలో నోటీసు బోర్డు పెట్టారని, నాగరాజు అనే వ్యక్తి నోటీసు బోర్డును తొలగించి దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. ఇతన్ని ప్రశ్నించిన స్థల కొనుగోలుధారులు పై క్రిమినల్ కేసులు పెడతామని, చంపివేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆగ్రహించారు. వీరిపై తమకు ప్రాణహాని ఉందని మదనపల్లి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ స్థలం రాదని మనోవేదనకు గురైన శంకర్ అనే వ్యక్తి మృతి చెందారని తెలియజేశారు. సంబంధిత రెవిన్యూ అధికారులు రికార్డులు సమగ్రంగా పరిశీలించి ఆ భూమి తనది అంటున్న షేక్ జావిద్ పైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ను కోరారు. స్పందించిన ఎస్పీ మదనపల్లి డిఎస్పి వద్దకు వెళ్లి మీ సమస్యను తెలపాలని సూచించారు.
Reporter
Namitha News