నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - మే 26 : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను హోం మంత్రి అనిత, మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ఈసారి మహానాడు పండుగ హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మహానాడును హైబ్రిడ్ రూపంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని తెలిపారు. మొదట మహానాడును నెల్లూరులో నిర్వహించాలని భావించినప్పటికీ, ఈసారి మరింత వైభవంగా క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. లోకేష్ నాయకత్వంలో పార్టీకి అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, టెక్నాలజీని వినియోగించి గ్రామ, నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా మహానాడును వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొంటూ మహానాడును వీక్షిస్తున్నారని వెల్లడించారు. పొదుపు చర్యలతో పాటు పార్టీకి కొత్త దిశను చూపించే విధంగా మహానాడు నిర్వహిస్తున్నామని, నవశకానికి నాంది పలికే తొలి అడుగుగా ఈ మహానాడు నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈసారి “స్త్రీ శక్తి” నినాదంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యంగా మహానాడు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు
Reporter
Namitha News