నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 09 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) మూడవ సంవత్సరం చదువుతున్న కలిచెర్ల వేణుమాధవ్ ‘గోసాత్’ (Gosaath) పేరుతో ఒక వినూత్న రైడ్-షేరింగ్ మరియు వాహన అద్దె ప్లాట్ఫారమ్ను రూపొందించారు. ఈ ప్లాట్ఫారమ్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ అధికారికంగా ప్రారంభించారు. స్థానిక రవాణా అవసరాలను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించబడిన ఈ యాప్, ప్రయాణికులు మరియు డ్రైవర్లకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో కూడిన రూట్-మ్యాచింగ్ సదుపాయం, నమ్మకమైన రైడ్-ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది అని అన్నారు. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా డ్రైవర్లు తమ ఖాళీ సమయాన్ని వినియోగించి అదనపు ఆదాయం పొందే అవకాశముండగా, ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. యూనివర్సిటీ స్థాయి నుండే ఇలాంటి సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం యువతలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది అని అన్నారు. భవిష్యత్తులో ఈ యాప్ను మరింత విస్తరించి, కొత్త ఫీచర్లను జోడించి పెద్ద స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం gosaath.com ను సందర్శించవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హేగ్దే, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ ఎస్ కొమరగిరి,విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా, డాక్టర్ చొక్కనాథన్ లు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణ చేసిన వేణుమాధవ్ ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News