నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏబీఎన్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు గురువారం ఎస్సై టి అనిల్ కుమార్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఉదయం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో నాయకులు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసిన నిరాధార అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా వ్యక్తిత్వాన్ని హరించి ఉద్దేశపూర్వకంగా అవమాన పరిచే విధంగా వీకెండ్ కామెంట్స్ లో రాధాకృష్ణ ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా మహిళలను ఓ వస్తువుగా వారి వ్యక్తిత్వం, గౌరవం సామాజిక స్థాయిని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడు9 జర్నలిజానికి నిదర్శనం అన్నారు. వైకాపా కార్యకర్తలను బుద్ధిలేని వారిగా పిచ్చి వాళ్ల సమూహంగా అభివర్ణించడం హేయమైనా చర్యగా దుయ్యబట్టారు. మా నాయకుడు జగన్ తో పాటు పార్టీని మహిళలను కించపరిచే విధంగా డిబేట్లో మాట్లాడిన ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ, ఎడిటర్, సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News