నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 13 : సకల గుణాభిరాముడు శ్రీరాముని చరితమును సరళంగా రాసిన ఘనత కవయిత్రి మొల్ల మాంబ జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ & జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి,పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ... కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అన్నారు. ఆమె రచనా శైలి చాలా సరళమైనది మరియు రమణీయమైనదన్నారు. తాళ్లపాక అన్నమయ్య (అన్నమాచార్య) భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. సకల గుణాభి రాముడు శ్రీరాముని చరితమును ఎందరో ఎన్నో విధాలుగా విధములుగా రచించినప్పటికీ సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు బాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా రాయడం ఆమె ప్రత్యేకత అన్నారు. మన కుటుంబం, మన భాష, మన సంస్కృతిపై ముందుగా మనమే ప్రేమ చూపిస్తేనే సమాజం, దేశం పట్ల కూడా ప్రేమ పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.మొల్ల జ్ఞాపకార్థం 2017లో భారత ప్రభుత్వం మొల్ల తపాలా బిళ్ల విడుదల చేసిందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇంచార్జ్ తేజస్విని మాట్లాడుతూ.... శ్రీ కృష్ణదేవరాయలు సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని, మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో రచించిందన్నారు. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతిగా ఉందన్నారు. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉందని, తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు కె. వేమ నారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీరాములు, ట్రెజరర్ రెడ్డప్ప, జనరల్ సెక్రెటరీ లోకేష్, ఆర్గనేజర్ గోపి,తెలుగు పండిట్ రిటైర్డ్ ఏవి వి ప్రసాద్ శర్మ, గోవిందరాజులు, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News