నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,* గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ వి.జె. రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. వెండితెరపై పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి అద్భుత విజయాలు సాధించిన ఆయన, రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి సామాన్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ దార్శనికత, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు, సమాజ శ్రేయస్సుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఎంటిఓ) కె. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ ఎం. చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది మరియు హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అంజలి ఘటించారు
Reporter
Namitha News