నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి,ఏడి సర్వే భరత్ కుమార్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిజిఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించినమండలాలను, గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు క్రమశిక్షణతో పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 332అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు
ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని, చుక్కల తాండకు చెందిన బి. మునస్వామినాయక్ గత ఆరు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన భార్య బాణావతి సామలమ్మకు కాళ్లు, చేతులు పనిచేయడం లేదని,తాను సుగాలి ఎస్టీ కుటుంబానికి చెందిన తాను కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ఇప్పటికే అనేక వైద్య చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయిందని,భార్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు. మదనపల్లి మండలం నక్కలదిన్నె తాండాకు చెందిన బాణావత్ మునుస్వామి నాయక్ తమ కుటుంబం గత 100 సంవత్సరాలుగా సర్వేనెంబర్ 396 ఏ లో 18 సెంట్ల భూమిలో వేరుశనగ పంట సాగు చేస్తు జీవనం కొనసాగిస్తున్నామని, తాము రెవెన్యూ కార్యాలయాలకు పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఈ విషయాన్ని పరిశీలించి వెంటనే పట్టా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పిచ్చాలివారిపల్లికి చెందిన గుమ్మిడి సుబ్బమ్మ,తన భర్త వెంకటరమణ రెడ్డి 11 సంవత్సరాల క్రితం మరణించడం జరిగిందని,తనకు ఎలాంటి ఆదాయం లేదని, జీవనం కష్టంగా మారిందని, పలుమార్లు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఈ విషయాన్ని తమరు పరిశీలించి వితంతు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారికి వివిధ రకాల అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News