నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో శతాబ్దాల క్రితమే మహా శివుడు నెలవై నేటికీ ఈ ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే పలికే ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఇలాంటి లక్షలాది శివభక్తుల మనోభావాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ చర్యలను ఆపడానికి తన వంతు కృషి చేస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య కొండలపై 2000 సంవత్సరం నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతితో మరుగున పడిందని అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి భూగర్భ గనుల శాఖ మంత్రి అరుణ కుమారి మైనింగ్ చేయడానికి ప్రయత్నించగా తంబళ్లపల్లె ప్రాంత శివ భక్తులు,ప్రజలు, పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు వ్యతిరేక లక్ష సంతకాల ఉద్యమాలు చేపట్టగా ప్రభుత్వం దిగివచ్చి ఐదు శాఖలతో విచారణ కమిటీ వేసినట్లు చెప్పారు. ఆ కమిటీ సభ్యులు సాదుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండల్లో సుదీర్ఘంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ మల్లయ్య కొండ మహాశివుడు సాదుకొండ వీరన్న గెవి నుండి ఇనుము కొండ మీదుగా మల్లయ్య కొండల్లో స్థిరపడిన శతాబ్దాల చరిత్ర ఆనవాళ్లు ప్రత్యక్షంగా చూసి కమిటీ సభ్యులు మహాశివుని మహిమలను గుర్తించి కొండల జోలికి వెళ్లరాదని ఇచ్చిన సమగ్ర నివేదికతో కనువిప్పు కలిగి మైనింగ్ చర్యలు పై ప్రభుత్వం తప్పుకున్నట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు తంబళ్లపల్లె నియోజకవర్గం తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది మహా శివుని భక్తులు ఆయన సేవకు విరాళాలు ప్రకటించి మల్లయ్య కొండలు దినదినాభివృద్ధికి కృషి చేస్తున్నారని అలాంటి మహాన్విత కొండలను మైనింగ్ చేపడితే దైవత్వంతో పాటు పచ్చటి పర్యావరణం, లక్షలాది జీవరాసులు, వన్యప్రాణులు, ఆశ్రయం కోల్పోయి మానవ మనుగడ కష్టతరమవుతుందని మల్లయ్య కొండల్లో మైనింగ్ పై ఈ ప్రాంత చిన్న పిల్లవాడిని కదిలించిన తీవ్ర వ్యతిరేకత వస్తుందని లక్షలాది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవునిపై రాజకీయాలు చేయకుండా మల్లయ్య కొండ శివుడు మన అందరి ఆరాధ్య దైవంగా మల్లయ్య కొండల్లో మైనింగ్ సమస్య పరిష్కారానికి శివ భక్తులు, ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పార్టీలకతీతంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Reporter
Namitha News