నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 05 : మదనపల్లె పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎంతో సహా అన్ని సంఘాలు అడుగుతున్నా పట్టించుకోకుండా ట్రాఫిక్ క్రమంబద్దీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి రోడ్లు వెడల్పు చేసి, ట్రాఫిక్ సిగ్నల్లు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చెయ్యడం ద్వారా సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే, ట్రాఫిక్ సమస్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి లకు కనిపించకుండా చెయ్యడం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయ్యటాన్ని తప్పు పట్టారు. పట్టణంలోని రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురైన ఫలితంగా ట్రాఫిక్ ఆటంకాలు తీవ్రంగా ఉన్నాయని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు అలాంటిది ఆదిలారులకు ఎందుకు కనబలేదని ప్రశ్నించారు. అధికారులు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వలన విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగం, ఉపాధ్యాయులు, ఆసుపత్రులకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్నీ ఆక్రమణలు పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా, వాళ్ళ బిల్డింగ్ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టింది, వారి వద్ద వేల రూపాయలు బాడుగలు (అద్దెలు) వసూలు చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెనువెంటనే ఈ రోడ్ల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న వారపుసంతను టమాట మార్కెట్ యార్డుకు, మార్కెట్ యార్డును పట్టణ బయటకు తరలించాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అభివృద్ధి చెయ్యాలని, ఫుట్ పాత్ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపిఎం ఉద్యమం చేస్తుందని తెలిపారు
Admin
Namitha News