నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30: దళితులపై దాడి,న్యాయ పోరాటానికి మద్దతు తెలిపిన బహుజన సేన - రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మండల కేంద్రమైన కురబలకోట లో కుల వివక్ష, దౌర్జన్యం చోటుచేసుకున్నాయి. ఎస్సీ కాలనీకి వెళ్లే దారిని అడ్డుకోవడమే కాకుండా, ప్రశ్నించిన దళిత ఆటో డ్రైవర్పై కులం పేరుతో దూషణలకు దిగి భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు: కురబలకోట ఎస్సీ కాలనీకి చెందిన A. గంగాధర్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 28వ తేదీ రాత్రి పని ముగించుకుని తన ఆటోలో ఇంటికి వెళ్తుండగా, స్థానిక బస్టాండ్ పక్కన ఉన్న పొడవు అబ్దుల్ అనే వ్యక్తి పెద్ద పెద్ద బండరాళ్లను దారికి అడ్డుగా వేశాడు. ఆటో వెళ్లడానికి వీలు లేకపోవడంతో గంగాధర్ దీనిపై ప్రశ్నించగా, అబ్దుల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కులం పేరుతో దూషణలు - భౌతిక దాడి: "మీ మాదిగ పల్లెవాళ్ళు నా ఇంటి ముందు నుంచి వెళ్లకూడదు" అంటూ అబ్దుల్ బాధితుడిని అత్యంత అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించాడు. దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించే ప్రయత్నం చేయగా, గంగాధర్ను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గంగాధర్ బావమరిది శివ, స్థానికుడు శ్రీనివాసులు అడ్డుకోబోగా.. అబ్దుల్ కుమారుడు ఉమర్ కూడా వారితో కలిసి గొడవకు దిగాడు. బాధితులను పిడిగుద్దులతో కొట్టడమే కాకుండా, తాము ఆరాధించే దేవుళ్లను ఉద్దేశించి కూడా అసభ్యంగా మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి: గత ఆరు నెలలుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, ఆ దారి గుండా వస్తే "నరుకుతాం" అని నిందితులు బహిరంగంగా బెదిరిస్తున్నారని గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన దారిని అడ్డుకుంటూ, దళితులపై నిరంతరం దౌర్జన్యానికి పాల్పడుతున్న పొడవు అబ్దుల్ మరియు అతని కుమారుడు ఉమర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను డిమాండ్ చేశాడు.
Reporter
Namitha News