నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 ః తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) పంచాయతీ ఎగువ ముట్ర వారి పల్లి కు చెందిన ముట్ర కుటుంబాలకు చెందిన దేవర ఎద్దు బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. గత పది రోజులుగా ఎద్దు కు కంటి వద్ద గాయమై అస్వస్థతకు గురి అయింది. మెరుగైన చికిత్సలు చేయించిన ఫలితం లేక ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గ్రామ దేవతగా పూజిస్తున్న దేవరఎద్దు మృతితో ముద్దల దొడ్డి పంచాయతీ మూగబోయింది.గురువారం ముట్రవారి దేవర పెద్ద కె. నరసింహారెడ్డి, దేవర ఎద్దు భక్తుడు ఎం. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి సాంప్రదాయ బద్దంగా దేవర ఇంటి వద్ద ఎద్దు మృతదేహానికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వందలాదిగా ముట్ర కుటుంబీకులు, మహిళలు, ప్రజలు దేవర ఎద్దు కు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ట్రాక్టర్ లో ఊరేగింపుగా దేవర ఎద్దును ఊరేగించి ఖననం చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేలుళ్లు, డప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దేవర ఎద్దును అశ్రు నయనాలతో సాగనంపారు. ఈ కార్యక్రమానికి ముద్దలదొడ్డి పంచాయితీ తోపాటు మండలంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దేవరెద్దు అంత్యక్రియల్లో పాల్గొనడం విశేషం.
Reporter
Namitha News