నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 19 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పారిశ్రామిక విద్యా పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి.టెక్ మరియు ఎం.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు బెంగళూరులోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) కేంద్రాన్ని సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీ-డాక్ నాలెడ్జ్ పార్క్ మరియు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లలో అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిశోధనలు, ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎమ్.రోహిత్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు అక్షయ, ప్రాజెక్ట్ అసోసియేట్ లు పాల్గొని భారతదేశపు స్వదేశీ మైక్రోప్రాసెసర్ ‘వేగా’ రూపకల్పన, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలలో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కల్పించారు. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా అందిస్తున్న పరిశ్రమ-ఆధారిత శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయి ప్లేస్మెంట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ పారిశ్రామిక పర్యటన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పుస్తక జ్ఞానాన్ని పరిశ్రమలలో అమలవుతున్న ప్రాక్టికల్ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించుకునే అవకాశం పొందడంతో పాటు, గ్లోబల్ టెక్నాలజీ ధోరణులు మరియు భవిష్యత్తులో ఉన్న ఉపాధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన పొందారని తెలిపారు. ఈ పర్యటనలో డాక్టర్ ఆర్. నిధ్యా మరియు టి. తంగరసన్ ల అధ్యాపక బృందం మరియు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News