నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 13 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె మల్లయ్య కొండ మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష అనంతరం మల్లయ్య కొండలో డి.ఎస్.పి మహేంద్ర తో కలిసి పర్యటించారు. కొండకు వచ్చే వేలాది మంది భక్తులకు తాగునీరుతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, మరుగుదొడ్లు ఏర్పాట్లు,మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, క్యూ లైన్ల భారీ కేడ్లు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ విషయంలో పోలీసులు, వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.భక్తులకు అత్యవసర చికిత్సల కోసం ఉచిత వైద్య శిబిరంతో పాటు అత్యవసర అంబులెన్స్ అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు, ఫారెస్ట్ అధికారులు కొండపై ధూమపానం, మద్యపానం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాదాల పై అప్రమత్తంగా ఉండి ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలన్నారు.రాత్రిపూట భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పఠిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేయాలన్నారు.మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ కింద అన్నదాన శిబిరాన్ని పరిశీలించి కమిటీ సభ్యులను ప్రశంసించారు. కొండకు వెళ్లే రవాణా బస్సుల వివరాలను అడిగి తెలుసుకుని ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ సమస్య,భద్రత పై ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ రమణారెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై అనిల్ కుమార్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు, ఈఓ ముని రాజా, కొండకిట్ట,ఏఈ సురేంద్ర, వినోద్ కుమార్, రమణ, మండల స్థాయి అధికారులు, అన్నదాన కమిటీ సభ్యులు,టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News