నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు ఉపాధి అవకాశాలను పెంచి వలసలను నివారించడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రారంభమైన అన్నమయ్య జిల్లా మొదటి మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలకు మండం సుధీర్ కుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలు వ్యవసాయ కార్మికులుగా జీవనం సాగిస్తున్నాయని, వీరంతా భూమిలేని నిరుపేదలేనని తెలిపారు. శారీరక కష్టాన్ని ఆధారంగా చేసుకుని జీవించే ఈ వర్గానికి భూపంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ కూలీలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని, గతంలో 10 శాతం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పుడు 40 శాతం భారం రాష్ట్రాలపై పడుతోందన్నారు. కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇవ్వడం, అవి కూడా ఆలస్యంగా విడుదల కావడం వల్ల పథకం అమలు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం కొనసాగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులో ఉన్నప్పటికీ భూస్వాముల సంఖ్య పెరుగుతోందని, పాలకవర్గాలే భూస్వాములుగా మారుతున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని, ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం సంఘం శక్తివంచన లేకుండా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు హరి శర్మ సంఘీభావం ప్రకటిస్తూ వ్యవసాయ కార్మికులకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ప్రతినిధులు మహాసభల్లో పాల్గొన్నారు.
Reporter
Namitha News