నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 21 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు సైబర్ సెక్యూరిటీ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క ప్రాముఖ్యత అనే అంశం పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నై కి చెందిన జోహో కార్పొరేషన్ రీజినల్ మేనేజర్, ఆనంద్ పళనిసామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆనంద్ పళనిసామి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యురిటీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత యంత్రాలు, అల్గోరిథములు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ళ ద్వారా సైబర్ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని, నెట్వర్క్లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అన్నారు. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని. ఏ.ఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్గా మార్పులు చెందే మాల్వేర్, సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు . అందువల్ల AI ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు మరియు సైబర్ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్ భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుంది అని అన్నారు.విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్త, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, కోఆర్డినేటర్స్ కె.పి మణికందన్, ఎమ్.ముత్తరసు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News