నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 02 : తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పంచాయతీ పరిధిలో మదనపల్లి కడప హైవే రోడ్డులో గొర్రెల బొలోరో వాహనం బోల్తా పడి ఇరువురు దుర్మరణం చెంది 6 మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుండి కలకడ మండలం పాపి రెడ్డిగారిపల్లెకు చెందిన గొర్రెల రైతులు గొర్రెలు కొనుగోలు చేసి ఓ బులోరా వాహనం లో పాపి రెడ్డి గారి పల్లెకు బయలుదేరారు. మదనపల్లి కడప జాతీయ రహదారి తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట సమీపంలోని హైవే రోడ్డు పక్కన గల బ్రిడ్జిని బలోరో వాహనం అదుపుతప్పి ఢీకొని లోయలోకి పడిపోయింది.ఈభారీ రోడ్డు ప్రమాదంలో వాహనంలోని నజీర్ (53) సైఫుల్లా(23) అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 మంది క్షతగాత్రులను గుర్రం కొండకు చెందిన 108 వాహనంలో చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, పెద్దమండెం ఎస్సై హరిహర ప్రసాద్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News