నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 18 : రెవెన్యూ సేవల్లో వేగం పారదర్శకతతో పెండింగ్ దరఖాస్తులను నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రెవిన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజలలో రెవెన్యూ శాఖపై సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ (Public Grievance Redressal System) ద్వారా రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 33,153 సమస్యలు రాగా 27,657 సమస్యలను 83.42% పరిష్కరించడం జరిగిందన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ పరిధిలోకి వెళ్లకుండా మిగిలిన వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు పెట్టిన ప్రతి అభ్యర్థనను ప్రాధాన్యంగా తీసుకొని ఆలస్యం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని తక్షణమే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లో 756 దరఖాస్తులు అందగా 339 ని నాణ్యతగా పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన వాటిని కూడా మార్గదర్శకాలు అనుసరించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు చేరువగా సమస్యలు పరిష్కరించే వేదికగా రెవెన్యూ క్లినిక్స్ను సమర్థవంతంగా నిర్వహించాలని, అక్కడే ఎక్కువ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 22A చుక్కల భూముల సమస్యల పరిష్కారం కీలక అంశమని పేర్కొంటూ, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, చట్టపరమైన విధానాల్లో స్పష్టతతో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియలను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూమి యాజమాన్య మార్పులకు సంబంధించి ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. అలాగే రీ-సర్వే పనులను కచ్చితత్వంతో, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతర రెవెన్యూ అంశాలపైనా సమగ్రంగా సమీక్షించి, ప్రతి స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఇందులో ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జీరో ఖాతాలు, హౌసింగ్ ఫర్ ఆల్, భూ సేకరణ, ఈ ఆఫీస్ ఫైల్స్ నిర్వహణ తదితరాలపై తీసుకోవాల్సిన చర్యలలో పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, సర్వే శాఖ ఏడి భరత్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తాసిల్దార్లు, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News