నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది పథకాల అమలు 100 శాతం కావాలి – కాలనీల్లో మౌలిక వసతులు తప్పనిసరి: పి.వి.పి వెంకటప్ప గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వి.పి వెంకటప్ప స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గిరిజనులందరికీ వందశాతం చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా సందర్శించిన ఆయన గిరిజన ప్రాంతాల పరిస్థితిని విశ్లేషించి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 50 వేల గిరిజన జనాభా ఉన్న నేపథ్యంలో వారి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజనులకు ఎలాంటి లోటు లేకుండా పథకాలు అందేలా కృషి జరుగుతోందన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో గిరిజనులకు అందుతున్న లబ్ధులు, పథకాల అమలు, రిజర్వేషన్ అమలు, నిధుల వినియోగంపై పూర్తి వివరాలను నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గిరిజన కాలనీలలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా స్మశాన వాటికల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆధార్ కార్డుల లేమి కారణంగా పింఛన్లు, రేషన్ వంటి సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ప్రతి కాలనీలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టళ్లలో తాగునీటి సమస్యలు, విద్యలో వెనుకబాటుతనం, వలస సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. “చదువే గిరిజనుల భవిష్యత్తు” అని పేర్కొంటూ విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించి ప్రతి తాండా, కాలనీలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ఎఫ్ఐఆర్ నమోదు నుంచి పరిహారం చెల్లింపుల వరకు అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని పోలీసు శాఖకు సూచించారు. మున్సిపల్ పరిధిలో షాపులను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్టీలకు కేటాయించడం తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో నమోదైన 41 అట్రాసిటీ కేసుల్లో 39 కేసులకు రూ.24.66 లక్షల పరిహారం చెల్లించినట్లు అధికారులు వివరించగా, మిగిలిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో గిరిజనులు రహదారులు, గృహాలు, పింఛన్లు, ఆధార్ కార్డులు, స్మశాన వాటికలు, భూమి సమస్యలపై వినతులు సమర్పించారు. జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కే. తేజస్విని, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News