నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం కూలీల పొట్టకొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాలేసి వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధి చట్టాన్ని కాపాడు కుంటామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కొత్త చట్టాన్ని రద్దు చేయిస్తా మని ఈసందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీని మతోన్మా దులు హత్య చేసిన రోజు అని, ఆ మతోన్మాద వారసులే ఈ రోజున దేశాన్ని పాలిస్తూ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం వలన కూలీలకు పనులు కుదించబడతాయని, రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటుందని ఫలితంగా ఉపాధి లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. వందరోజుల పనిని 120 రోజులుగా కొత్త చట్టంలో తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం దానికి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ? జీవో జారీ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. పాత చట్టంలో 100 శాతం నిధులు కేటాయిస్తే కొత్త చట్టంలో 60 శాతం కేటాయించి మిగిలిన 40 శాతం ప్రభుత్వాలు భరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. 100 శాతం నిధులు ఉన్నప్పుడు కూలీలు చేసిన ఉపాధి పనులకు నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తే ఎలా కూలీలకు డబ్బులు వస్తాయని ప్రశ్నించారు. కాబట్టి ఉపాధి చట్టాన్ని రద్దు చేయటం అంటే ప్రభుత్వం కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, నరసింహ, ఆటో యూనియన్ నాయకులు రెడ్డెప్ప, మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ, రాజు, తులసమ్మ, కృష్ణయ్య, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News