నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్కేం 01 : కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు తగ్గించి, గ్రామీణ పేద కార్మికుల పొట్టకొడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు తీవ్రంగా ధ్వజమెత్తారు. నిధుల కోతను నిరసిస్తూ, ఫేస్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 20 ఏళ్ల ఉపాధి హామీ చట్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉపాధి హామీ నిధులకు అత్యంత దారుణంగా కోత విధించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం సుమారు రూ. 9,346 కోట్ల నుండి రూ. 10,648 కోట్లు కేటాయించే స్థానంలో, ఈ ఏడాది కేవలం రూ. 738 కోట్లకే పరిమితం చేసి పేదలకు తీవ్ర ద్రోహం చేశారని విమర్శించారు. గతంలో జిల్లాకు లక్ష కుటుంబాలకు పని కల్పిస్తే, ఈ నిధుల కోత వల్ల ఇప్పుడు జిల్లాకు కేవలం 9,461 కుటుంబాలకు మాత్రమే పని దొరికే దుస్థితి ఏర్పడిందన్నారు. అంటే గతంలో ఒక మండలానికి కేటాయించిన నిధులు కూడా నేడు జిల్లా మొత్తానికి ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వాల దుర్మార్గానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరికొత్తగా తెచ్చిన ‘ఫేస్ యాప్’ (Face App) విధానం గ్రామీణ కూలీలకు శాపంగా మారిందని, ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, గంటల తరబడి హాజరు నమోదు కాకపోవడంతో వేలాది మంది కార్మికులు పని ప్రదేశాల నుండి ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని చెప్పినా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 4,000 కోట్లు మా దగ్గర లేవని చెప్పడంతో పేదలకు నిధులు అందకుండా పోయాయని విమర్శించారు. వ్యవసాయ పనులు లేని ఈ వేసవి కాలంలో కూలీలకు పనులు కల్పించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు బ్రతుకలేక పట్టణాలకు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పాత పద్ధతిలోనే నిధులు కేటాయించి, ప్రతి కుటుంబానికి 125 రోజుల పని దినాలు గ్యారెంటీగా కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకానికి మన రాష్ట్రానికి తక్షణమే రూ. 10,000 కోట్ల నిధులు కేటాయించాలని, కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని మరియు రెండు పూటల పని పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, కనీస వేతనాన్ని రూ. 700 లకు పెంచాలని, కూలీలకు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను విడుదల చేయాలి. పని ప్రదేశాలలో తాగునీరు, నీడ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలను, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివాసులు, నారాయణ, అనురాధ సంఖ్యలో గ్రామీణ మహిళలు, కూలీలు మరియు వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు
Reporter
Namitha News