నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎం.బి.ఏ) విభాగం ఆధ్వర్యంలో, మిట్స్ అల్యూమ్ని రిలేషన్స్ సెల్ సహకారంతో అల్యూమ్ని మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, విద్యాసంస్థల అభివృద్ధి, ప్రతిష్ఠ మరియు సమాజంలో వాటి గుర్తింపును పెంపొందించడంలో పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అల్యూమ్ని నెట్వర్క్ ద్వారా ప్రస్తుత విద్యార్థులకు పరిశ్రమల అవసరాలపై అవగాహన, కెరీర్ మార్గదర్శకత్వం, ఇంటర్న్షిప్లు మరియు ఉపాధి అవకాశాలు మరింత విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల విజయాలే విద్యాసంస్థలకు నిజమైన గుర్తింపని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యా ప్రతిభతో పాటు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా పెంపొందించుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి మాట్లాడుతూ, విద్యాసంస్థ మరియు పూర్వ విద్యార్థుల మధ్య బలమైన అనుబంధం సంస్థ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అల్యూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు మెంటరింగ్, గెస్ట్ లెక్చర్లు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, పరిశ్రమల అనుసంధాన కార్యక్రమాలు మరియు కెరీర్ మార్గదర్శకత్వంలో చురుకుగా పాల్గొని తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకోవాలని కోరారు. అల్యూమ్ని నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి విద్యార్థుల వృత్తి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జి. అనిల్ దత్, దుర్గా చప్పల, అజయ్ నక్కల, శ్రవంతి. ఎస్ లు తమ వృత్తి ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, పరిశ్రమలలో ఉన్న అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు మరియు ఉద్యోగ రంగంలో విజయానికి అవసరమైన అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. అలాగే భవిష్యత్తులో ఇంటర్న్షిప్లు, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమల పరిచయాలు మరియు ప్లేస్మెంట్ అవకాశాల కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థుల ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, మెంటరింగ్ కార్యక్రమాలు మరియు భవిష్యత్ సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. 2007 నుండి 2025 వరకు వివిధ బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొని తమ విద్యా జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి, అల్యూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత, కోఆర్డినేటర్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News