నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పిచ్చి కుక్క వీరంగం సృష్టించి మూడు గ్రామాల ప్రజలు ముప్పు తిప్పలు పెట్టి గ్రామాలలోని 22 పశువులను గాయపరిచి సంచలనం సృష్టించి బెంబేలెత్తించిన సంఘటన కోసువారి పల్లి పంచాయతీలో వెలుగు చూసింది. పంచాయతీలోని దేవరబురుజు, సి కె దయ్యాలవారిపల్లి, మేకల వారి పల్లె గ్రామాలలో బుధవారం తెల్లవారుజామున ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించి కనపడిన పశువులను విచక్షణ రహితంగా కరచి తీవ్రంగా గాయపరిచింది. తొలుత దేవరబురుజులో రెడ్డప్ప రెడ్డి కి చెందిన రెండు పశువులతో పాటు గ్రామంలో ఆరుబయట గల పలు పాడి ఆవులు, దూడలను గాయపరగా స్థానికులు తరిమికొట్టగా అదే ఊపులో పక్కనే గల సీ.కే దయ్యాలవారిపల్లి లో సైతం పలువురు రైతులకు చెందిన పాడియావులు దూడలను గాయపరిచి చివరిగా మేకల వారి పల్లెలో మరోసారి విజృంభించి పాడి పశువులను గాయపరిచింది. మొత్తంగా మూడు గ్రామాలలో 16 పాడి ఆవులు, ఆరు పాడి దూడలను గాయపరిచింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకుమ్మడిగా పిచ్చి కుక్కను వెంటాడి చంపేశారు. పిచ్చికుక్క కాటుకు గురైన పశువుల రైతులు ఆందోళనతో లబోదిబోమంటూ పశువుల డాక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పశు వైద్య సిబ్బందిని పై మూడు గ్రామాలకు పంపించి కుక్క కాటు పశువులకు ర్యాపిడ్ టీకాలను వేయడానికి పురమయించారు. పశు వైద్యాధికారి ఇందు, సిబ్బంది రమేష్, నాయక్ లు కుక్క కాటు బారిన పడిన పశువులకు ర్యాపిడ్ టీకాలు వేసి నెలరోజుల పాటు వర్షానికి తడవరాదని వైద్య సిబ్బంది సూచనలు, సలహాలు పాటించాలని రైతులకు సూచనలు ఇచ్చారు. కుక్క కాటు రైతులు లక్షలాది రూపాయల వ్యయంతో కొని వాటి పాల దిగుబడితో జీవనోపాధి సాగిస్తున్నామని పశువులకు ప్రాణాపాయం జరిగితే వాటినే నమ్ముకున్న మేము ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చికుక్క పశువులపై పడటం జరిగిందని అదే చిన్నారులు, మనుషులపై విజృంభిస్తే పరిస్థితి ఏంటని తలచుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి కుక్క కాటు పశువుల రైతులను ఆదుకోవడానికి అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News